పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయింపు అంశం స్పీకర్ దగ్గర విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో త
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయింపు అంశం స్పీకర్ దగ్గర విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇవ్వగా మరో ఐదుగురిపై తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆరెస్ నుండి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తాను మార్టీ మారలేదని బీఆరెస్ లోనే ఉన్నానని అసెంబ్లీ స్పీకర్కు వివరణ ఇచ్చారు. తన అనర్హతపై వచ్చిన నోటీసులకు స్పందిస్తూ బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించారు.
తాను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదని, ఇప్పటికీ ఆ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నానని తన వివరణలో కడియం స్పష్టం చేశారు.తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదని, కనీసం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు.కావాలనే కొందరు తనపై బురదజల్లుతున్నారని, రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక కడియం స్పీకర్ కు ఇచ్చిన వివరణపై ఆయన చేతిలో ఓటమి పాలైన తాటికొండ రాజయ్య మండిపడ్డారు. ఆయన దీనిని చరిత్రహీనమైన వివరణగా అభివర్ణించారు. వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ, మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నానని చెప్పుకుంటూ ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నానని ఎలా అంటారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్లోకి వెళ్తున్నానంటూ కడియం గతంలో మాట్లాడలేదా అని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహానికి కడియం తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు ఉంటే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించారు. లేకుంటే, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి వీధిలో కడియం దిష్టిబొమ్మలను వేళాడదీస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

