టాలీవుడ్ నటుడు శివాజీ తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మహిళల చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. డిసెంబర్ 22 రాత్రి
టాలీవుడ్ నటుడు శివాజీ తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మహిళల చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. డిసెంబర్ 22 రాత్రి హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో, శివాజీ నేటి తరం హీరోయిన్ల దుస్తుల ఎంపికపై పురుషాహంకారంతో వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడారు. మహిళల అందం చీరలోనే ఇమిడి ఉంటుందని, పొట్టి బట్టలు ధరిస్తే అందులో విలువ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. “అందం అనేది చీరలో నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది. xxxx కనపడే దాంట్లో ఏమీ ఉండదు” అంటూ ఆయన మాట్లాడారు.
ఇంకా, పొట్టి బట్టలు వేసుకున్న హీరోయిన్లను బయట పొగిడినా, లోపల మాత్రం xxxx అని అసహ్యించుకుంటారని అభ్యంతరకర పదాలను ఉపయోగించారు.
శివాజీ తన వ్యాఖ్యలలో మహానటులు సావిత్రి, సౌందర్యలను ఆదర్శంగా ప్రస్తావిస్తూ, గ్లామర్కు ఒక హద్దు ఉండాలని, మహిళలు తమ అందాన్ని సంప్రదాయ దుస్తుల్లోనే ప్రదర్శించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు పురుషాహంకారం, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, డ్రెస్సింగ్ ఫ్రీడమ్పై దాడి అని సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్లో హీరోయిన్ బిందు మాధవి చీర కట్టుకుని వచ్చినందుకు శివాజీ ప్రత్యేకంగా అభినందించారు, కానీ అతని మాటలు స్టేజ్పై ఉన్న నవదీప్, బిందు మాధవి వంటి వారిని కూడా ఇబ్బందికరంగా మార్చాయి.
వివాదం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారి శివాజీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహిళలే కాకుండా అనేక మంది పురుషులు కూడా శివాజీ వ్యాఖ్య్తలను ఖండించారు. గాయని చిన్మయి శ్రీపాద మొదట స్పందించారు. తన X (ట్విటర్) అకౌంట్లో, “తెలుగు నటుడు శివాజీ హీరోయిన్లకు అనవసర సలహాలు ఇస్తూ ‘XXXX’ వంటి వ్యాఖ్యలు చేశాడు. మహిళలు చీరలు వేసుకుని తమ ‘XXX’ కవర్ చేసుకోవాలని చెప్పాడు. అతను జీన్స్, హుడీ వేసుకుని ఉన్నాడు – అతను ధోతీ వేసుకుని ఇండియన్ కల్చర్ ఫాలో చేయాలి” అంటూ ఘాటుగా విమర్శించారు.
చిన్మయి మరో పోస్ట్లో, శివాజీ వంటి వారు మహిళలను ఆబ్జెక్ట్గా చూడటం సమస్య అని, ఇలాంటి మాటలు ప్రొఫెషనల్ స్పేస్లలో అనుచితమని పేర్కొన్నారు.
తాజాగా, యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ కూడా ఈ వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో, “ఇది నా బాడీ.. నీది కాదు. మాకు నచ్చినట్లే మేము ఉంటాం” అంటూ స్పష్టం చేశారు. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని, వారి వ్యక్తిగత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం తగదని ఆమె పేర్కొన్నారు.
ఈ పోస్ట్ వైరల్ అవుతూ, మహిళల హక్కులపై చర్చను మరింత తీవ్రతరం చేసింది.ఈ వివాదం సినీ పరిశ్రమలో మహిళల పట్ల ఉన్న డబుల్ స్టాండర్డ్స్ను బయటపెట్టింది. శివాజీ తన హిట్ చిత్రం ‘మంత్ర’లో చార్మీతో కలిసి గ్లామర్ సాంగ్లలో నటించారని, ఇప్పుడు అదే గ్లామర్ను విమర్శించడం హిపోక్రసీ అని నెటిజన్స్ పేర్కొంటున్నారు.
తను చేసిన వ్యాఖ్యలపై శివాజీ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘దండోరా’ చిత్రం సామాజిక అన్యాయాలు, కుల వివక్షలపై ఫోకస్ చేసినట్టు ప్రమోట్ అవుతుంది, కానీ ఈవెంట్లో శివాజీ మాటలు ఆ సందేశానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
శివాజీ ఇంకా ఈ వివాదంపై అధికారికంగా స్పందించలేదు, కానీ ఈ అంశం టాలీవుడ్లో మహిళల స్థానం, స్వేచ్ఛలపై మరిన్ని చర్చలకు దారితీస్తుందని అంచనా.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2025

