ఒడిశాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కందమాల్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. అ
ఒడిశాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కందమాల్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. అందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు ఎలియాస్ గణేష్ ఉన్నారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం: కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు తారసపడటంతో లొంగిపోవాలని బలగాలు హెచ్చరించాయి. అయితే, మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళాలు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బలగాలు ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన పాక హనుమంతు నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన వారు. ఇతను 45 ఏళ్ళుగా మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది.

